హరీశ్ రావు ఢిల్లీ పర్యటన వెనుక పెద్ద ప్రణాళికే ఉంది: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
- కేసీఆర్ బయటకు వస్తుంటే.. హరీశ్ ఢిల్లీకి వెళ్లరన్న చామల
- తన భవిష్యత్తుపై హరీశ్ స్పష్టతతో ఉన్నారని వ్యాఖ్య
- జీవన్ రెడ్డి చేరిక వల్ల బీఆర్ఎస్కు లాభం కంటే నష్టమే ఎక్కువన్న చామల
బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మునిగిపోయే పడవలా మారిందని, ఆ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఏడాది తర్వాత ఫామ్హౌస్ నుంచి బయటకు వస్తుంటే, హరీశ్ రావు మాత్రం ఢిల్లీకి వెళ్లడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని, ఆయన అక్కడ ఎవరిని కలిశారో త్వరలోనే బయటపడుతుందని పేర్కొన్నారు. హరీశ్ రావు తన భవిష్యత్తు ప్రణాళికలపై స్పష్టతతో ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంశంపై స్పందిస్తూ.. ఆయన చేరిక ఆ పార్టీ నేతలకే ఇష్టం లేదని ఎంపీ అన్నారు. ముఖ్యంగా హరీశ్ రావు ఎప్పుడూ జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించలేదని, కేటీఆర్ బ్రతిమిలాడితేనే ఆయన జగిత్యాల వెళ్లారని గుర్తు చేశారు. జీవన్ రెడ్డి చేరిక వల్ల బీఆర్ఎస్కు లాభం కంటే నష్టమే ఎక్కువని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి సముచిత స్థానం ఇచ్చినా, ఆయన అక్కడ ఉంటూనే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారని మండిపడ్డారు.
బీఆర్ఎస్లో చేరిన సీనియర్ నేతల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉందని, జీవన్ రెడ్డి కూడా అక్కడ ఒక్కరోజు మాత్రమే వీఐపీ అని చామల ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బలహీనపడిందని చూపించడానికే బీఆర్ఎస్ ఇలాంటి చేరికలను ప్రోత్సహిస్తోందని, కానీ క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదని ఆయన స్పష్టం చేశారు.